పాఠశాలల సమస్యలు, ఫీజుల పెంపుపై ABVP ధర్నా
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని, అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యులు మంగళవారం సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన( ABVP Protests) చేపట్టారు. పాఠశాల విద్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ఏబీవీపీ (ABVP) కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆందోళన చేపట్టారు. గేట్లు తోసుకుని కార్యాలయంలోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ధర్నా చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా వాటిని మూసివేసేందుకు ప్రయత్నాలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో 'ఫీజు నియంత్రణ చట్టం' తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, బోధనేతర, MEO, DEO పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని, గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని, అలాగే జాతీయ విద్యా విధానం (NEP-2020)ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి వాటిని పరిష్కరించడంలో విఫలమైతే, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






