విజయ్కు సీబీఐ నుంచి పిలుపు
కరూర్ కేసులో నేడు మరోసారి హాజరు కావాలని టీవీకే అధినేతకు నోటీసులు
ఇప్పటికే పలుమార్లు హాజరైన విజయ్
న్యూఢిల్లీ, మార్చి 9: ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ(టీవీకే) అధినేత విజయ్కు సీబీఐ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. కరూర్ కేసులో విచారణకు మరోసారి హాజరు కావాలని విజయ్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కరూర్ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు మంగళవారం విచారణకు హాజరు కావాలని కోరుతూ విజయ్కు సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్లో నిర్వహించిన ప్రచారసభ తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణకు హాజరుకావాలని టీవీకే అధినేతకు నోటీసులు జారీ చేసింది. కాగా కరూర్ కేసులో విచారణలో భాగంగా విజయ్ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలోని దర్యాప్తు కార్యాలయానికి హాజరయ్యారు. ఇప్పటివరకు తాము సేకరించిన ఆధారాలపై విజయ్ స్పష్టత నివ్వాల్సి ఉండడంతో ఆయనకి మరోసారి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ర్యాలీ సమయంలో జనసమూహ నిర్వహణ ఏర్పాట్లు, ఈవెంట్ వేదికకు మంజూరుచేసిన అనుమతులు, టీవీకే పార్టీ, తమిళనాడు వాదనలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పది రోజుల సమయం కావాలి: విజయ్
సీబీఐ నోటీసులపై స్పందించిన టీవీకే అధినేత విజయ్ అధికారులకు లిఖితపూర్వక సమాధానం పంపారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్, ఇతర కారణాల వల్ల మంగళవారం జరగాల్సిన విచారణకు హాజరు కాలేనని విజయ్ స్పష్టం చేశారు. విచారణకు సిద్ధమవ్వడానికి, హాజరు కావడానికి తనకు కనీసం 10 రోజుల సమయం కావాలని సీబీఐని కోరారు. గడువు ముగిసిన తర్వాత విచారణకు తప్పకుండా హాజరవుతానని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు.




