వరద ముంపులో వట్టిమల్ల–నిమ్మపల్లి వంతెన
ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని పోలీసుల సూచన
కోనరావుపేట, జూలై 31 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల నుంచి నిమ్మపల్లి(Vattimalla Nimmapalli bridge) వెళ్లే మూలవాగుపై ఉన్న వంతెన వరద నీటిలో మునిగిపోవడంతో శుక్రవారం వేములవాడ సబ్డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ) శ్రీనివాసులు, చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రవీందర్, కోనరావుపేట ఎస్ఐ కె. ప్రశాంత్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ప్రజల భద్రత దృష్ట్యా వంతెనకు ఇరువైపులా వాటర్ ట్యాంకులను అడ్డంగా ఏర్పాటు చేసి వాహనాలు, ప్రజలు వరద ప్రవాహాన్ని దాటకుండా చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున మునిగిపోయిన వంతెనలు, వాగులను దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని, తప్పనిసరిగా ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించాలని అధికారులు సూచించారు.అదేవిధంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నట్లయితే వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసు శాఖ 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు.






