కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్
కరీంనగర్,(విజయక్రాంతి): తమకు మేయర్ పదవి ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానని నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బడ్జెట్ లో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎందుకు పెట్టలేదని బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలనలో రూపొందించిన బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేసి పెట్టారన్నారు. బడ్జెట్ లో నిధులను ఎలా సమీకరిస్తారో పేర్కొనలేదన్నారు.
పండుగలకు పెట్టే ఖర్చులను తగ్గించిన బీజేపీ పాలక వర్గం అవసరం లేకున్న నియమించిన ఉద్యోగులు, వారు వాడుతున్న వాహనాల వృథా ఖర్చులు తగ్గించాలన్నారు. 18 వేల ఇండ్లపై పెంచిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించాలని, ప్రజలపై పన్నుల భారం వేయొద్దన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను చూస్తే జాలేస్తుందని.. వారే అధికారంలో ఉండి... కుక్కలు, కోతుల బెడద గురించి నిరసన తెలపడం శోచనీయమన్నారు. ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన తర్వాత అక్రమ కట్టడం అంటూ నోటీసులు ఇచ్చి కాంగ్రెస్, బీజేపీ కమీషన్ల కోసం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. డంప్ యార్డ్, నగర అభివ్రుద్ది చేయడం నాతో కాదని బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.




