సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ
హైదరాబాద్: ఉబెర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి(Uber CEO Dara Khosrowshahi) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఉబెర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (Uber Chief Business Officer) మధు కన్నన్, ఉబెర్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్జీత్ సింగ్ , చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి(CM's Special Secretary Ajit Reddy) పాల్గొన్నారు. ఉబేర్ విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని సీఇవో ఖోస్రోషాహి తెలిపారు.
హైదరాబాద్ లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Uber Center of Excellence) ను విస్తరిస్తున్నట్లు ముఖ్యమంత్రికి ఉబేర్ సీఇవో సూచించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన ఈ మొదటి సెంటర్ లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని సీఇవో వివరించారు. ఉబెర్ సంస్థ భారత్ ఫ్యూచర్ సీటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తి చూపించింది. పార్కింగ్ వ్యాపారంలోకి వచ్చే అంశాన్ని పరిశీలించాలని ఉబెర్ సీఇవోకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో పార్కింగ్ సమస్యను రేవంత్ రెడ్డి ఉబెర్ ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన పైన సమగ్ర అధ్యయనం చేస్తామని ఉబెర్ ప్రతినిధులు వెల్లడించారు. వ్యాపార విస్తరణకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని ఉబెర్ ప్రతినిధులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.






