తీవ్ర రూపం దాల్చిన ఆదివాసీల నిరసన దీక్ష
- పోలీసులకు, ఆదివాసీలకు మధ్య తోపులాట
- మెయిన్ గేట్ దాటి పాఠశాలలోకి వెళ్ళడానికి ప్రయత్నించిన నాయకులు
- నిలువరించిన పోలీస్ బలగాలు
గుండాల,(విజయక్రాంతి): మండల పరిధి ముత్తాపురం సమీపంలోని ఏకలవ్య పాఠశాల ముందు నాలుగు రోజుల నుండి తొమ్మిది ఆదివాసీ సంఘాల చైర్మన్ చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష తీవ్ర రూపం దాల్చింది. పాఠశాలలో ఒక కులాన్ని ప్రోత్సాహిస్తూ తీజ్ పండుగను నిర్వహించడం, పాఠశాలలోని ఆదివాసీ టీచర్స్ ను, విద్యార్థులను వేదింపులకు గురిచేస్తున్నారని తలపెట్టిన నిరసన దీక్ష శుక్రవారం పోలీసులకు, ఆదివాసీ నాయకులకు మధ్యలో తోపులాటతో కొద్దిసేపు ఉదృత వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా నాయకులు మెయిన్ గేట్ నుండి పాఠశాలలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే మొహరించి ఉన్న పోలీస్ బలగాలకు, ఆదివాసీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. గేట్ ద్వారా లోనికి వెళ్లాలని ప్రయత్నించిన ఆదివాసీ నాయకులను పోలీసులు అదుపు చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి ఆర్సీవో అరుణకుమారి, అడిషనల్ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ పాఠశాలకు వచ్చి విచారణ జరుపుతున్నారు.






