రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కార్మికుల మృతి
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... రాంపూర్ గడ్డ గ్రామం భావన రైస్ మిల్ లో పనిచేస్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కార్మికులు గాంధారి వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అధిక వేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనం రాంపూర్ గడ్డ కల్వర్టు వద్ద అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడంతో బాధితుల తల, ముక్కు, చెవుల నుండి తీవ్ర రక్తస్రావం జరిగిందని వారు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించగా, క్షతగాత్రులను పరిశీలించిన వైద్య సిబ్బంది అప్పటికే మరణించినట్టుగా నిర్ధారించారని వారు అన్నారు. మృతులను లాల్తూర్ ముఖియా (21), రాహుల్(21), జావిద్ అన్సారీ (22) గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు స్థానిక ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. అతి వేగం జీవితాలను అంతం చేస్తుందని , వాహనదారులు డ్రైవింగ్ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు..




