18 May, 2026 | 12:08 PM

సామ దుబ్బ తండాలో దారుణం

18-05-2026 10:50 AM

చిరుత పులి దాడిలో మూడు లేగ దూడలు హతం

బోరుమంటున్న బాధితులు

అధికారులు ఆర్థిక సహాయం అందించాలని వినతి

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని సామ దుబ్బ తండాలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. తండాలో రాత్రి చిరుత పులి దాడిలో మూడు లేగ దూడలు హతమయ్యాయి.తండాకు చెందిన రమావత్ రమేష్ లేగ దూడలను తండా పక్కనే ఉన్న తన పశువుల పాకలో కట్టివేసి ఉంచాడు.ఒక్కసారిగా రాత్రి సమయంలో కట్టివేసి ఉంచిన లేగ దూడలపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది.రెండు లేగ దూడలపై దాడి చేసి అక్కడే  హతమార్చగా,మరో లేగ దూడను దూరంగా తీసుకువెళ్లి హతమార్చింది. ఈ దాడిలో రూ.50 వేల వరకు ఆస్థి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.ఈ విషయమై బాధితుడు రమేష్ మాట్లాడుతూ.. తాను నిరుపేదనని కాయ కష్టం చేసి బ్రతుకుతున్నానని జరిగిన నష్టానికి అధికారులు స్పందించి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.

గ్రామ సర్పంచ్ జాదవ్ రేణుక గణపతి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. ఈ విషయమై సర్పంచ్ మాట్లాడుతూ... అటవీశాఖ అధికారులు స్పందించి తండాలను చిరుత పులి దాడుల నుంచి రక్షించాలని కోరారు. అవసరమైన చర్యలు తీసుకుని కాపాడాలన్నారు. తండాలు అటవీ ప్రాంతం పక్కనే ఉండడంతో చిరుత పులి ఎప్పుడు దాడి చేస్తుందోనని తండా వాసులు భయపడుతున్నారని సర్పంచ్ తెలిపారు. గతంలో సైతం ఇలాంటి దాడులు జరిగాయని ఆయన వ్యక్తం చేశారు అయినా అటవీశాఖ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా అటవీ శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.