పెద్దమ్మ తల్లి ఆలయంలో దొంగల చేతివాటం
భక్తుల మనోభావాలకు గాయం
బేగంపేట పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ..
ఆలయ కమిటీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మంథని సీఐ స్వామి, ఎస్ఐ శ్రీనివాస్
రామగిరి, ఆగస్టు16 విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమ్మవారి ఆలయంలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడటం స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా జరిగిన ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న మంథని సీఐ బుద్దే స్వామి, రామగిరి ఎస్సై శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చోరీ జరిగిన ప్రదేశాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
అమ్మవారి ఆలయంలోనే దొంగల తెగింపు
అమ్మవారి ఆలయంలో దొంగలించిన నిందితులు ఎవరు? అనే ప్రశ్న ప్రస్తుతం బేగంపేటలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో త్వరలోనే చోరీకి పాల్పడిన వారి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






