2 April, 2026 | 4:13 AM

నేల నెర్రెబారి.. రైతు ఆశలు ఆవిరి

02-04-2026 12:00 AM
  1. చివరి దశలో సాగునీరు లేక ఎండుతున్న పంటలు

చివ్వెంల మండలంలో రైతుల విలవిల

ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని వేడుకోలు

చివ్వెంల, ఏప్రిల్ 1: మండలంలో సాగుచేసిన వారిపొలాలకు చివరి దశలో సాగునీరు అందక పంటపోలాలు ఎండి నేల నెర్రెబారి పోతుండడంతో రైతుల ఆశలు ఆవిరి అవుతున్నాయి. ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో వేల ఎకరాల్లో పచ్చగా ఉన్న వరి పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నాయి. ఎంతో కష్టపడి, అప్పులు చేసి సాగు చేసిన పంటలు చివరి దశలో నీరు లేక నాశనం అవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఒకవైపు ఎరువుల కొరత, మరోవైపు నీటి లేమి రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులు, ఇప్పుడు పంట పూర్తిగా నష్టపోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆవేదన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

పంట పొలమే.. పశువులకు మేత..   

పంట పొలాలకు నీటి కొరతతో తీవ్రముగా ఉండడంతోపరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంటలు కోతకు రాకముందే ఎండిపోవడంతో రైతులు పొలాలను పశువుల మేపు భూములుగా మార్చుకుంటున్నారు. ఆవులు, బర్రెలు, గొర్రెలను పొలాల్లో మేపుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మండలవ్యాప్తంగా రైతుల పరిస్థితి రోజురోజుకూ మరింత క్షీణిస్తోంది.

ప్రభుత్వం, సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సాగునీరు లేక రైతు బతుకు అస్తవ్యస్తంగా మారిదని తన మనో వేదనను వెల్లబుచ్చుతున్నారు. వెంటనే చర్యలు లేకపోతే మరింత నష్టం తప్పదని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే వేల ఎకరాలలో పంట ఎండిందని, ఇప్పటికైనా ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీరు విడుదల చేసి తమ పంటపొలాలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

కాలువ నీరు వదిలి పంటను కాపాడాలి..

కాలువలో నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. మూడు ఎకరాల్లో వరి సాగు చేసి లక్షల్లో పెట్టుబడి పెట్టినం. ఇప్పుడు నీటి కొరత కారణంగా పంటలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పులు చేసి సాగు చేసాం ఇప్పుడు పంటలు ఎండిపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి వస్తుంది. కాబట్టి ఎస్సాఎస్పీ నీళ్లను వదిలి పంటలను కాపాడాలి.  

 ధరావత్ బేబీ, మహిళా రైతు, పచ్చనాయక్ తండ

పెట్టుబడి రావడమూ కష్టమే..

నాకు ఉన్న రెం డు ఎకరాల భూమి  నీ ఎస్సారెస్పీ కాలు  వ నీరుపై ఆధారప డి వరి సాగు చేశా. ఒక ఎకరాకు రూ.30 వేల చొప్పున మొ త్తం రూ.60 వేలకుపైగా ఖర్చు పెట్టిన. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉంది. నీరు అందక పంట ఎండిపోతుంది. పంట బాగానే ఉందనుకున్నాం. కానీ చివరి సమయంలో నీరు లేక ఎండిపోవడం చాలా బాధగా ఉంది. పెట్టిన ఖర్చు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. 

 లాలు, రైతు, బధ్యతండ