సినీ జానపదాల రాణి
తెలుగు చలనచిత్ర సంగీత స్వర్ణయుగంలో తన గలగలపారే జానపద సొగసులతో, మరపురాని మధుర గీతాలతో కోట్లాదిమంది గుండెలను ఓలలాడించిన గాయనీమణి కోకా జమునారాణి. ఏడేళ్ల పసిప్రాయంలోనే ‘మధురానగరిలో..’ అంటూ పాటల ప్రయాణాన్ని ప్రారంభించి, ఐదు భాషల్లో ఆరు వేలకు పైగా అమర గీతాలను అందించిన ఆ గాన కోకిల భౌతికంగా దూరమైనా, ఆమె పాడిన ‘మావా మావా..’ వంటి సజీవ నాదాలు శ్రోతల హృదయాల్లో ఎప్పటికీ అమరమే.
దక్షిణాది చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు శ్రోతలను మైమరిపించిన ప్రముఖ పాతతరం నేపథ్య గాయని కోకా జమునారాణి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో, సహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, గురువారం తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు కల్లహళ్లిలో ఆమె అంత్యక్రియలు అధికారికంగా ముగిశాయి.
ఏడేళ్ల ప్రాయంలోనే గాయనిగా..
జమునారాణి 1938 మే 17న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఆమె తండ్రి కే వరదరాజులు నాయుడు కాగా, తల్లి కే ద్రౌప ది ప్రసిద్ధ వాయులీన (వైలిన్) కళాకారిణి. తల్లి నుంచి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జమునారాణి, ఏడేళ్ల ప్రాయంలోనే చిత్తూరు వీ నాగయ్య నిర్మించిన ‘త్యాగయ్య’ (1946) చిత్రం ద్వారా బాలనటిగా, గాయనిగా వెండితెరకు పరిచయమయ్యారు.
ఆ సినిమా లో బాలల కోసం ఆమె పాడిన ‘మధురానగరిలో..’ అనే పాటతోనే ఆమె అద్భుత ప్రస్థానం మొదలైంది. 13 ఏళ్ల వయసు నుంచే ఆమె కథానాయికలకు పూర్తిస్థాయిలో పాటలు పాడటం ప్రారంభించారు. తన సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళం భాషల్లో కలిపి 1940ల నుంచి 1980ల వరకు 6,000 కంటే ఎక్కువ పాటలను ఆలపించారు.
ఆమె గాత్రంలో ఒక ప్రత్యేకమైన జానపద సొగసు, స్పష్టమైన ఉచ్ఛారణ, లయబద్ధమైన శైలి ఉండటం వల్ల శ్రోతలు ఆమెను అమితంగా ఆరాధించేవారు. పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని పూర్తిగా సంగీతానికే అంకితం చేసిన ఆమె బ్రహ్మచారిణిగా శేషజీవితాన్ని గడిపారు.
తెలుగులో చిరస్థాయిగా నిలిచే పాటలెన్నో..
తెలుగు సినీ సంగీత స్వర్ణయుగంలో జమునారాణి పాడిన ఎన్నో పాటలు నేటికీ ఎవర్గ్రీన్ క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ‘దేవదాసు’ చిత్రంలో బాల్య వయసు పాత్రకు పాడిన ‘ఓ దేవదా..’ పాట ఆమె గొంతు నుంచి జాలువారిందే. ‘మంచి మనసులు’ సినిమాలో ‘మావా మావా మావా.. ఏమే ఏమే భామా..’ అనే ఈ ఒక్క పాట ఆమె రసజ్ఞతకు నిదర్శనం అని చెప్తారు.
‘రాముడు భీముడు’లో ‘సరదా సరదా సిగరెట్టు.. ఇది దొరలకు దొరకని బెనిఫిట్టు..’, ‘లవకుశ’లో ‘విరిసే చల్లని వెన్నెల.. హాయిగా పాడాలి.. నాట్యమాడాలి..’, ‘బంగారు తిమ్మరాజు’లో ‘నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన..’ వంటి పాటలు ఆలపించారు. దశాబ్దాల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రత్యేకంగా జమునారాణిని పిలిపించి కమల్ హాసన్ ‘నాయకుడు’ సినిమాలో ‘నాన్ సిరితాల్ దీపావళి..’ (తెలుగులో ‘నే నవ్వితే దీపావళి..’) పాటను పాడించారు. ఈ పాట ఆ తరం శ్రోతలను కూడా అలరించింది.
దిగ్గజ సంగీత దర్శకులతో..
1950వ దశకంలో తమిళ చిత్రసీమలో తనకు ప్రాముఖ్యత రావడానికి కవి కన్నదాసన్, సంగీత దర్శకుడు కేవీ మహాదేవన్ ప్రోత్సహించారని రాణి పలు సందర్భాల్లో తెలిపారు. ఆమె ఘంటసాల, కేవీ మహదేవన్, ఎస్పీ కోదండపాణి, ఇళయరాజాలతోపాటు జీ రామనాథన్, ఎస్ దక్షిణామూర్తి, ఏఎం రాజా, వేద, వీ నాగయ్య, జేఏ రెహమాన్, పెండ్యాల నాగేశ్వరరావు, టీ చలపతిరావు, ఆనంద సమరకోన్, టీజీ లింగప్ప, విశ్వనాథన్, ఎస్ రామమూర్తి, ఎస్టీఏ రాజన్నమ్మమణి, ఎంఎస్ రావు, మాస్టర్ వేణు, ఆర్ సుదర్శనం, జీకే వెంకటేశ్, వీటీ రాజగోపాలన్, వీ కుమార్, టీఆర్ పాపా, ఎస్వీ వెంకట్రామన్, విజయ భాస్కర్, కున్నక్కుడి వైద్యనాథన్, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు, బ్రదర్ ఎంబీ శ్రీ లక్ష్మణన్, జీఎంఎస్ లక్ష్మణన్, బాబూరాజ్, చంద్రబోస్ వంటి వారితో కలిసి పనిచేశారు.
రాణి మరుపురాని యుగళగీతాలను ఎక్కువగా టీఎం సౌందరరాజన్, ఏఎం రాజా, సీర్కాజి గోవిందరాజన్, ఏఎల్ రాఘవన్, పీబీ శ్రీనివాస్, మొహిదీన్ బేగ్లతో పాడారు. ఇక ఘంటసాల, తిరుచ్చి లోగనాథన్, జేపీ చంద్రబాబు, ఎస్సీ కృష్ణన్, ధరాపురం సుందరరాజన్, వీటీ రాజగోపాలన్, హెచ్ఆర్ జోతిపాల, కముకర పురుషోత్తమన్, పీ కళింగరావు, పిఠాపురం నాగేశ్వరరావులతోనూ పలు పాటలు ఆలపించారు.
ముఖ్యంగా పీ సుశీల, పీ లీల, ఎల్ఆర్ ఈశ్వరి, జిక్కి, ఎస్ జానకి వంటి ప్రముఖ గాయనీమణులతో యుగళగీతాలు పాడారు. ఏపీ కోమల, ఏజీ రత్నమాల, ఎంఎల్ వసంతకుమారి, టీవీ రత్నం, కే రాణి, స్వర్ణలత, ఎంఎస్ రాజేశ్వరి, సూలమంగళం రాజలక్ష్మి, ఎల్ఆర్ అంజలి, స్వర్ణ, రేణుక వంటి మహిళా గాయకులతోనూ పాటలు పాడారు.
జమునారాణి చేసిన అపూర్వ సేవలకు గానూ ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. తమిళనాడు ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారంతోపాటు ‘అన్నాదురై’ అవార్డుతో సత్కరించింది. జమునారాణి భౌతికంగా మనమధ్య లేకపోయినా, ఆమె ఐదు దశాబ్దాల పాటు ఆలపించిన వేలాది అమర గీతాలు సంగీతాభిమానుల గుండెల్లో ఆమెను ఎప్పటికీ సజీవంగానే ఉంచుతాయి.






