ఘనంగా విద్యార్థి క్యాబినెట్ ఎన్నికలు
ముకరంపుర,(విజయ క్రాంతి): కరీంనగర్ భగత్నగర్ లోని రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యార్థుల క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరయ్యారు. ఈ ఎన్నికల యొక్క ప్రధాన ఆకర్షణగా, పాఠశాల చరిత్రలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు విద్యార్థులు రూపొందించిన ఈవీఎం మిషన్స్ ద్వారా ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహించడం విశేషం.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల విధానాన్ని, ఈవీఎంల ద్వారా జరుగుతున్న పోలింగ్ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన స్వయంగా ఒక ఓటరుగా మారి హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అభ్యర్థులకు తన ఓటును వేశారు.విద్యార్థులను ఉద్దేశించి సునీల్ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వం, రాజ్యాంగం మనకు అందించిన అత్యంత గొప్ప ఆయుధం అని అభివర్ణించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని, అవి ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా మరియు రహస్యంగా జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపొందబోయే హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.






