డ్రగ్స్పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో డ్రగ్స్(drugs) నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు మార్గదర్శి స్కూల్ విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. లీడ్ కరికులం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించి, నాటికలు మరియు నృత్య ప్రదర్శనల ద్వారా మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మండల చిరంజీవి మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు సమాజంలో మంచి మార్పుకు దారితీయాలని వారు ఆకాంక్షించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం లేదా అమ్మకం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ద్వారా డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, అందువల్ల యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా లేదా అమ్ముతున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.యువత డ్రగ్స్కు దూరంగా ఉంటేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగగలరని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ప్రశాంత్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ మండల పూర్ణిమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




