కే.సీ.ఆర్. నగర్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహణ
తంగళ్ళపల్లి, జూన్ 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కే.సీ.ఆర్. నగర్లో పానీ పూరీ తినడం వల్ల కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.ఆశా వర్కర్లు కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ ఏంజెల్ అల్ఫ్రెడ్, డాక్టర్ నాగేంద్ర బాబు, వైద్యాధికారి డాక్టర్ స్నేహ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
అధికారులు పరిశుభ్రత, తాగునీటి వనరులను పరిశీలించి ప్రజలు స్వచ్ఛమైన తాగునీటిని మాత్రమే వినియోగించాలని సూచించారు. అలాగే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేసిన 24 గంటల లోపే ఉపయోగించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని అవగాహన కల్పించారు. స్థానిక వార్డు సభ్యురాలు కల్వకుంట్ల రోజా,తో పరిసరాల పరిశుభ్రత, డ్రైనేజీ నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలపై చర్చించి ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ బాలయ్య, హెచ్ఎస్ ప్రమీల, సతీష్ కుమార్, ఎంఎల్హెచ్పీ ఆరీఫ్, నవీన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






