బత్తాయికి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనపై ప్రత్యేక చొరవ
- ఎమ్మెల్యే బీఎల్ఆర్
మిర్యాలగూడ,(విజయక్రాంతి): జిల్లాలో బత్తాయి పంటలకి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని ఆదిశగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన స్టేట్ సిట్రస్ సెమినార్ 2026లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బత్తాయి సాగు అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారం, సాగులో సాంకేతిక పద్ధతుల వినియోగంపై అవగాహన కల్పించడం పట్ల అభినందనలు తెలిపారు.
జిల్లాలో బత్తాయి సాగు ప్రధాన పంటగా మారిందని, వేలాది మంది రైతులు బత్తాయి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. మార్కెట్ ధరల్లో అస్థిరత, సాగు ఖర్చులు, ఎరువులు, పురుగుమందుల వినియోగం పై అవగహన కల్పించేందుకు సదస్సు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. సదస్సు వేదికగా రైతులు, శాస్త్ర వేత్తలు, చేసిన సూచనల ఆధారంగా బత్తాయి రైతులకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం, ఎగుమతులతో పాటు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.






