అంగన్వాడీలో పేలిన రైస్ కుక్కర్
8 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు
కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన
కొల్లాపూర్ రూరల్, జూలై 6: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం రైస్ కుక్కర్ పేలిన ఘటనలో ఎనిమిది మంది అంగన్వాడీ చిన్నారులు గాయపడ్డారు. ఆయా నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో భోజనం వండిన కుక్కర్ మూతను చిన్నారుల మధ్యలోనే నిర్లక్ష్యంగా తెరిచే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
కేంద్రంలో మొత్తం తొమ్మిది మంది చిన్నారులు ఉండగా, వారిలో ఎనిమిది మంది గాయపడగా అర్జున్ అనే చిన్నారికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్పందించిన ఐసీడీఎస్, ఇంచార్జి డీడబ్ల్యూఓ దమయంతి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులను పరామర్శించారు. ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత ఆయాకు మెమో జారీ చేసినట్లు తెలిపారు.






