నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు
ప్రభుత్వ నిర్ణయంపై ఆసక్తి గా ఎదురుచూస్తున్న స్థానికులు
గుట్టలో యాదాద్రి పరి రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాల లీజు గడువు ఈనెల 31తో ముగుస్తుండడంతో ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని వర్తక సంఘం, యాదాద్రి పర్యటన కమిటీ, నిరుద్యోగులు, స్థానికులు, ప్రజలలో ఉత్కంఠ నెలకొంది. కొండపైన వర్తక సంఘం సంవత్సరానికి 10 షాపుల పేరుమీద 1.60 కోట్లు కిరాయి చెల్లిస్తుందని, ప్రస్తుతం కొండపైన వర్తక సంఘాన్ని రద్దుచేసి టెండర్లు వేస్తే దేవాలయానికి 20 నుండి 30 కోట్లు అధికంగా నిధులు సమకూరుతాయి.
ఈ నిధులతో భక్తులకు మెరుగైన వసతులు, సౌకర్యాలను కల్పించవచ్చని వెంటనే వర్తక సంఘాన్ని రద్దుచేసి టెండర్లు వేయాలని యాదగిరిగుట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా వివిధ రూపాలలో ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. వర్తక సంఘం వారు గత 50, 60 సంవత్సరాలుగా కొండపైన వర్తకం చేసుకుంటూ జీవనోపాధి తో కుటుంబాలను పోషించుకుంటున్నామని యాదాద్రి పునర్ నిర్మాణం తర్వాత కొండపైన 114 దుకాణాలకు గాను 10 దుకాణాలు నిర్వహించుకుంటూ 114 కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయని గడువును పెంచాలని ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి.
వీరికి స్థానిక ఎమ్మెల్యే అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, మంత్రులు తో సంబంధాలు ఉండడంతో ఎలాగైనా వర్తక సంఘం గడువు ను పెంచుతారనే ధీమాతో ఉన్నారు. కొద్ది నెలలుగా కొండపైన వర్తక సంఘం పేరుతో భక్తులపైన చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా కొంతమంది టెండర్లు వేయాలని ఎన్నో ప్రయత్నాలు చేయగా అది ఫలించకపోవడంతో ఈ విషయం స్థానికులు, నిరుద్యోగుల దృష్టికి రావడంతో స్థానికులు, నిరుద్యోగులు యాదాద్రి పరిరక్షణ కమిటీ గా ఏర్పడి గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లు వేయాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు.
యాదగిరిగుట్ట కొండపైన ఈవో కార్యాలయానికి అనేక వినతి పత్రాలు ఇవ్వడమే కాక హైదరాబాదులోని దేవాదాయ శాఖలో కార్యాలయంలో సైతం వర్తక సంఘాన్ని రద్దు చేయాలని ఎన్నో మార్లు వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ విషయమై గత నెల రోజులుగా ప్రచార మాధ్యమాలలో స్థానికులు వర్తక సంఘం రద్దు చేయాలని చక్కర్లు కొడుతుంది. యాదాద్రి పరిరక్షణ కమిటీకి స్థానికులు, ప్రజలు, నిరుద్యోగుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. వర్తక సంఘాన్ని రద్దు చేయాలని కోరుతూ యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం యాదగిరిగుట్ట తాహసిల్దార్ కార్యాలయం నుండి పాతగుట్ట చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదురుగా ధర్నా నిర్వహించారు.
యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ యాదగిరిగుట్ట కొండపైన వర్తక సంఘాన్ని రద్దుచేసి టెండర్ వేయాలని తద్వారా దేవస్థానానికి 20 నుండి 30 కోట్ల ఆదాయము సమకూరుతుందని, ఎంతోమంది స్థానికులకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించవచ్చని అన్నారు. కొండపైన ఉన్నటువంటి 10 తాత్కాలిక దుకాణాలకు గడువు చివరి రోజు కావడంతో ఇప్పటివరకు ఎటువంటి రెన్యువల్ నోటిఫికేషన్ రాలేదని, ఒకవేళ టెండర్ వేయకుండా రెన్యువల్ చేసినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని , ఆమరణ నిరాహార దీక్ష కైనా కమిటీ సభ్యులు పూనుకుంటామని. ఆ దేవుని ఆదాయం కోసం ఎక్కడి వరకై నా వెళ్తామని కమిటీ సభ్యులు అన్నారు.






