ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ‘బడిబాట’ విద్యా వ్యవస్థలో ఒక గొప్ప కార్యక్రమమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ లు పేర్కొన్నారు. శనివారం మిర్యాలగూడ మండల విద్యాధికారి ధీరావత్ ధర్మానాయక్ తో కలిసి ‘బడిబాట’ ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థినీ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. పేద, గిరిజన వర్గాల పిల్లలకు ప్రభుత్వ విద్య ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత కృష్ణకాంత్ నాయక్, ఉపాధ్యాయులు ఉపేందర్, తావూర్య, జానయ్య, లక్ష్మణ్, బాషా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






