ప్లాస్టిక్ భూతం మానవాళి మనుగడకే ప్రశ్నార్థకం
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
ముకరంపుర,(విజయక్రాంతి): ప్లాస్టిక్ భూతం ప్రపంచ మానవాళినే కాకుండా జీవకోటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నదని, ప్రతి పౌరుడు విధిగా ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని పాటించాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు మేయర్ క్యాంపు ఆఫీసులో శాతవాహన లయన్స్ క్లబ్ నిర్వహించిన ప్లాస్టిక్ బ్యాగ్ రహిత సమాజ నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో తయారు చేసిన గోడ పత్రికను ఆవిష్కరించిన మేయర్, క్లబ్ చూపిన చొరవను ప్రశంసించి మాట్లాడుతూ... నగర మురికి కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్నాయని, వాటిని తొలగించడానికి కార్పొరేషన్ సిబ్బంది ఎంతో శ్రమించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు సుస్థిర హరిత జీవనశైలిని అలవర్చుకోవాలని, లేని పక్షంలో క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ శ్రీనివాస్ను క్లబ్ సభ్యులు సముచితంగా సత్కరించారు.






