21 August, 2026 | 10:24 PM

ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం

21-08-2026 09:27 PM

అక్రమ నిల్వ, తరలింపుపై పోలీసుల చర్యలు

చట్టపరమైన చర్యలకు అప్పగింత

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ చేసినట్లు అనుమానిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శారాజీపేట గ్రామంలో గురువారం రోజున చోటుచేసుకుంది. పోలీసుల తనిఖీల్లో సుమారు 60 బస్తాల్లో ఉన్న PDS బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

బియ్యానికి సంబంధించి ఆలేరు పట్టణానికి చెందిన గుగులోత్ శంకర్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న PDS బియ్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించే ప్రక్రియ చేపట్టారు. PDS బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం లేదా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆలేరు పోలీసులు హెచ్చరించారు.