పీఎస్ఎల్ వద్దు..ఐపీఎల్ ముద్దు
సామ్ కరన్ స్థానంలో దాసున్ శనక
ముంబై, మార్చి 22 : ఐపీఎల్లో నాలుగో వంతు కూడా లేని పాకిస్థాన్ సూపర్ లీగ్కు విదేశీ క్రికెటర్లు వరుస షాకులు ఇస్తున్నారు. డబ్బులు పెద్దగా రాని పీఎస్ఎల్ కంటే కాసుల వర్షం కురిసే ఐపీఎల్ బెటర్ అంటున్నారు. ఇటీవలే జింబాబ్వే పేసర్ మజురబాని పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టులో చేరాడు తాజాగా శ్రీలంక క్రికెటర్ దాసున్ శనక పాక్ లీగ్కు గుడ్ బై చెప్పి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
గాయంతో రాజస్థాన్ రాయల్స్ నుంచి తప్పుకున్న ఆల్రౌండర్ సామ్ కరన్ ప్లేస్లో శనక రాబోతున్నాడు. దీనికి సంబంధించి లంక బోర్డుతో రాయల్స్ ఫ్రాంచైజీ చర్చలు జరిపింది. త్వరలోనే అతను జట్టుతో చేరతాడిని ఆ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. కాగా ఐపీఎల్ మినీ వేలంలో శనక అమ్ముడుపోలేదు. ఆ తర్వాత అతన్ని పీఎస్ఎల్ వేలంలోకి తీసుకున్నారు. అక్కడ లాహోర్ కలందర్స్ రూ.75 లక్షలకు దక్కించుకుంది.
ఇప్పుడు ఐపీఎల్ నుంచి ఆఫర్ రావడంతో ఇక్కడకు వచ్చేస్తున్నాడు. 2023 సీజన్లో అరంగేట్రం చేసిన ఈ లంక క్రికెటర్కు పెద్దగా అవకాశాలు రాలేదు. గుజరాత్ టైటాన్స్ తరపున కేవలం 3 మ్యాచ్లే ఆడాడు. ఓవరాల్గా టీ20 కెరీర్లో 1912 పరుగులు, 46 వికెట్లు పడగొట్టాడు.




