సిలిండర్లకు కొరతలేదు
ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు
సిలిండర్లను బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు..
పోలీస్,పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో టీమ్ లు ఏర్పాటు తనిఖీ లు పకడ్బందీ చర్యలు
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పిజిగ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ వెబెక్స్ సమావేశం ద్వారా డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా పై సమీక్షించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు డిస్టిక్ ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు.
జిల్లా కలెక్టర్ చైర్మన్ గా డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ కన్వీనర్ గా జిల్లా ఎస్.పి., రెవెన్యూ అదనపు కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి,జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి,ఎస్.సి.,ఎస్.టి., బి.సి., సంక్షేమ శాఖ అధికారులు,ఆయిల్ కంపెనీల ఆర్.ఎం.లు,గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి సభ్యులు గా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి కొరత లేదని ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
జిల్లాలో గ్యాస్ కు నిలువలు సరిపడా ఉన్నాయని పేర్కొన్నారు. యధావిధిగా సరఫరా జరుగుతూనే ఉందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ననుసరించి గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేసేలా డిస్ట్రిబ్యూటర్ లు సరఫరా చేయాలని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళు గురుకులాలు,ఆసుపత్రులు, అంగన్వాడి లు,పాఠశాలలు, గ్యాస్ సరఫరా లో సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది తో సమావేశం నిర్వహించి సమీక్షించాలని,గ్యాస్ అవసరం ననుసరించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
పోలీస్,పౌర సరఫరాల శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టీమ్ లు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బ్లాక్ విక్రయించకుండా,గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ లను కమర్షియల్ గా వినియోగించకుండా తనిఖీ లు చేపట్టి కేసులు నమోదు చేయాలని సూచించారు. జిల్లా ఎస్.పి.డి.జానకి మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా తనిఖీ లు చేపట్టి 28 సిలిండర్ లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశం లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ,జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జిల్లా నోడల్ అధికారి సూర్య కిరణ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు
కొనసాగుతున్న తనిఖీలు..
జిల్లాలో శనివారం మహబూబ్ నగర్ పట్టణం,జడ్చర్ల, దేవర కద్ర పట్టణాల్లో పౌర సరఫరాల డి టి.లు,అధికారులు,పోలీస్ శాఖ అధికారుల తో ఏర్పాటు చేసిన 4 టీమ్ లు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో వాణిజ్య పరంగా వినియోగిస్తున్న 41 డొమెస్టిక్ సిలిండర్ లను స్వాధీనం చేసుకుని 32 కేసులు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.




