రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి..
ఒడిని వీడని పసి కోతి.. కంటతడి పెట్టించిన ఘటన
తంగళ్ళపల్లి జూలై 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామ బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తల్లి కోతి మృతి చెందింది. అయితే తల్లి చనిపోయిందనే విషయం తెలియని పసి కోతి ఆమె శరీరాన్ని గట్టిగా హత్తుకుని, ఒడిలోనే నిద్రపోయిన దృశ్యం అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది.
తల్లి ఒడిలోనే తనకు రక్షణ ఉందనే అమాయక నమ్మకంతో ఉన్న ఆ చిన్నారి కోతి దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. తల్లి ప్రేమకు హద్దులు లేవని, అది మనుషులకే కాదు మూగజీవాల్లోనూ అంతే గొప్పదని ఈ ఘటన మరో సారి గుర్తు చేసింది. ఈ హృదయ విదారక దృశ్యాలను చూసిన స్థానికులు భావోద్వేగానికి లోనవగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి వేలాది మంది నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. తల్లిబిడ్డల అనుబంధానికి ఈ ఘటన ఓ మౌన సాక్ష్యంగా నిలిచింది.






