14-02-2026 12:00:00 AM
ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్థాపించిన ‘దిల్ రాజు డ్రీమ్స్’ బ్యానర్లో తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మార్కండేయ’. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ ఇందులో కథానాయకుడు. ఈ సినిమాను మైథలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సిస్ట్లా వీఎంకే తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. “ఇతిహాసాల నుంచి తీసుకున్న ఒక కథకు ఆధునిక రూపమే మా సినిమా. ఇదొక మిస్టిక్ థ్రిల్లర్ మూవీ. మార్కండేయుడి పాత్రకు మోడరన్ వెర్షన్ ఈ చిత్రం” అన్నారు. డైరెక్టర్ సిస్ట్లా మాట్లాడుతూ.. “ఈ సినిమాకు ఏఐని ఒక సపోర్ట్గా వాడాం తప్ప ఏఐ నుంచి చేసిన షాట్స్ ఎక్కడా మూవీలో పెట్టలేదు” అని చెప్పారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. “మా ఎస్వీసీ సంస్థకు దిల్ రాజు డ్రీమ్స్ అనేది మరో విభాగం. ‘మార్కండేయ’ కంటెంట్ నచ్చి ఈ చిత్రాన్ని మా దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్లో తొలిచిత్రంగా రూపొందిస్తున్నాం. ఈ సినిమాను వచ్చే ఏడాది మహా శివరాత్రికి విడుదల చేస్తాం. ఈ బ్యానర్లో మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తు న్నాం. వాటిలో రెండు ఓటీటీ, మరో రెండు థియేట్రికల్గా రిలీజ్ అవుతాయి. మా బ్యానర్ అనౌన్స్ చేసినప్పుడు 330 స్క్రిప్టులు వచ్చాయి. వాటిలో వంద మాత్రమే మా వాళ్లు చదవగలిగారు.
వాటిలో ఐదారు సినిమాలు ఈ ఏడాది మా సంస్థ నుంచి వస్తాయి. కొత్త వాళ్లతో కొత్తదనం ఉన్న చిత్రాలను దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్లో చిత్రాలు చేయాలనుకుంటున్నాం. స్టార్స్తో మా ఎస్వీసీలో సినిమాలు చేస్తున్నాం. ప్రస్తుతం ఎల్లమ్మ, రౌడీ జనార్ధన, దేత్తడి మూడు సినిమాలు చేస్తున్నాం” అని తెలిపారు. డీవోపీ జగదీశ్ వర్మ భూపతిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ హరి ఎస్ఆర్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.