రైతుముంగిట 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
పెనగడపలో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
తూకంలో పారదర్శకత పాటించి రైతులకు అండగా నిలవాలి
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 29, (విజయక్రాంతి): నియోజకవర్గానికి ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరయ్యాయని, రైతుల కష్టాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నామని, అందుబాటులోకి వచ్చిన ఈ 22 కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. బుధవారం చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప గ్రామంలో నూతనంగా మంజూరైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కృషితో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో కేంద్రాలను మంజూరు చేయించామని తెలిపారు. అధికారులు, ఐకేపి సిబ్బంది కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, ముఖ్యంగా తూకం విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు, తేమపేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. రైతు పక్షపాతిగా ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఎంపిడివో శుభాషిణి, తహసీల్దార్ నాగరాజు, సర్పంచ్ కారం సీతారాములు పాల్గొన్నారు.






