నేటి నుండి జరుగు గ్రామసభల ప్రాముఖ్యతపై సమావేశం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో దివ్య దర్శన్ రావు అధ్యక్షతన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 2న సుల్తానాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో జరగబోయే గ్రామ సభలు, వాటి ప్రాముఖ్యత, సెన్సస్ సర్వే అంశాలపై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్టి గ్రామసభలలో గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వాటి వివరాలు ప్రజలకు తెలియజేయడము, గ్రామాలలో ఉన్న అవసరాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం మొదలగు వాటిపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని గ్రామ సభలను విజయవంతం చేయవలసిందిగా తెలపడం జరిగింది. గ్రామ సభల నిర్వహణ మరియు జన గణన సర్వేలో పాటించవలసిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక తహసిల్దార్ బషీరుద్దీన్, మండల విద్యాధికారి రాజయ్య , మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




