మావోయిస్ట్ నేత పాపారావు లొంగుబాటు
ఆయన తలపై రూ.2కోట్ల రివార్డు
లొంగిపోయిన 18 మంది మావోయిస్టుల నుంచి ఆయుధాలు స్వాధీనం
చర్ల, మార్చి 24(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చత్తీస్ఘడ్లోని బస్తర్ను మావోయిస్ట్ రహితంగా మార్చి ౩1లోగా మారు స్తామని విధించుకున్న గడువుకు వారం రోజుల ముందే మరో మావోయిస్ట్ అగ్రనేత పోలీసుల ఎదుట తన అనుచరులతో సహా మంగళవారం లొంగిపోయాడు. బస్తర్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న సీపీఐ మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్టర్ డివిజనల్ కార్యదర్శి పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య తన సాయుధ బృందం తో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
56 ఏళ్ల పాపారావు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సీనియర్ సభ్యుడు. ఇతను బీజాపూర్ జిల్లాలోని కుట్రు పోలీస్ స్టేషన్లో 17 మంది అనుచరులతో బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళలు కూడా ఉన్నారు. పాపారావు తలపై రూ.2 కోట్ల రివార్డు ఉంది.
హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బస్తర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా పాపారావు ఉన్నా డు.లొంగిపోయిన మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.పాపారావుపై 50 కేసుల వరకు ఉన్నాయి. సుక్మా జిల్లా కలెక్టర్ను కిడ్నాప్ చేసిన ఘటనలోనూ, గతంలో 76 మంది భద్రతా సిబ్బందిని బలిగొన్న ఘటనలోనూ పాపారావు హస్తం ఉందని భావిస్తున్నారు.




