17-02-2026 12:11:15 AM
40 వేల మందితో పోటెత్తిన ప్రాంగణం
దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయ స్థాయి వేడుకగా రికార్డు
ప్రముఖ గాయకుడు కార్తీక్ స్వరమాధుర్యం
హైదరాబాద్, ఫిబ్రవరి1౬(విజయక్రాంతి): ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవం వెల్లివిరిసేలా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఆర్జీఐ) ఆధ్వర్యంలో ఆది వారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలోనూ లేని విధంగా అత్యంత భారీ స్థాయి లో నిర్వహించిన ఈ వేడుకలకు మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, ఎంఆర్ (ఎంఆర్) యూనివర్సిటీల ప్రాంగణాలు వేదికయ్యాయి.
ఈ చారిత్రాత్మక ఘట్టంలో సుమారు 30,000 మంది విద్యార్థులు, 10,000 మంది బోధన, బోధనేతర సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం విశేషం. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు కలిసి ఒకే కుటుంబం గా ఏర్పడి అభిషేకాలు, భక్తి గీతాలు, జాగరణలతో శివనామస్మరణ చేయడంతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ప్రముఖ సినీ గాయకుడు కార్తీక్ తన భక్తి గీతాలతో సభికులను మైమరిపించారు. ఆయన ఆలపించిన గీతాలు వేలాది మందిలో భక్తి భావాన్ని నింపాయి. మరోవైపు, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రముఖ బ్యాండ్ ‘స్ట్రీట్ జామ్మర్స్’ ప్రదర్శన ఆకట్టుకుంది. సంప్రదాయ భక్తికి, ఆధునిక సంగీతానికి మేళవింపుగా సాగిన ఈ ప్రదర్శనలు రాత్రంతా విద్యార్థులను అలరించాయి.
ఇది దేశంలోనే ప్రత్యేకం: డాక్టర్ సీహెచ్ భద్రారెడ్డి
ఈ సందర్భంగా మల్లారెడ్డి గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ సీహెచ్ భద్రారెడ్డి మాట్లాడుతూ ‘దేశంలోనే ఇదొక ప్రత్యేకమైనది. 30వేల మం ది విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులతో కలిసి ఇలా దైవారాధనలో పాల్గొనడం సంతోషాన్నిస్తోంది. కార్తీక్, స్ట్రీట్ జామ్మర్స్ ప్రదర్శనలతో ఈ జాగరణను ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా తీర్చిదిద్దాం’ అన్నారు.
ఆత్మ జాగృతికి నిదర్శనం: డాక్టర్ సీహెచ్ ప్రీతిరెడ్డి
మల్లారెడ్డి గ్రూప్ వైస్ చైర్మన్ డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ ‘ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక ఆత్మజాగృతి. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఇంత క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో ఒకేచోట చేరడం మా సంస్థల స్ఫూర్తికి నిదర్శనం’, అని పేర్కొన్నారు.