18-02-2026 05:15:40 PM
రైతు హుస్సేన్ మానవత్వం పట్ల సర్వత్రా హర్షం
తుంగతుర్తి: గ్రామపంచాయతీ భవనం తోపాటు స్త్రీ శక్తి భవన కార్యాలయాల నిర్మాణానికి సుమారు రూ.6లక్షల రూపాయల విలువ చేసే నాలుగు గుంటల స్థలాన్ని గ్రామానికి చెందిన లకావత్ హుస్సేన్ అనే రైతు దాతృత్వంతో అందజేశారు. బుధవారం మండల పరిధిలోని గుడి తండా గ్రామంలో గ్రామ సర్పంచ్ గుగులోతు ఝాన్సీ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో గ్రామ అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతగా భావించి ఈ విలువైన స్థలాన్ని విరాళంగా ఇవ్వడం గ్రామస్తుల ప్రశంసలను అందుకున్నారు.
గ్రామంలో పంచాయతీ భవనం లేకపోవడంతో అంగన్వాడి భవనంలో కొనసాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రైతు హుస్సేన్ చేసిన ఈ మహాదానం గ్రామ చరిత్రలో నిలిచిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజాప్రయోజనాల కోసం ముందుకొచ్చిన రైతుకు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలని, స్థల దాత చేసిన ఈ సేవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పట్ల రైతు చూపిన సేవాభావం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి చింత సురేష్, ఉప సర్పంచ్ గుగులోతు పద్మ, వార్డు సభ్యులు దారావత్ బుజ్జమ్మ, గుగులోతు శ్రీను, గుగులోతు సాగర్, గూగులోతు వినోద, పాతులోతు సరోజా, లకావత్ దామోదర్, లకావత్ భద్రమ్మ,గ్రామ పెద్దలు బానోతు వెంకన్న, గుగులోతు రమణ, పాతులోతు సూర్య, బానోతు భగవాన్, తదితరులు పాల్గొన్నారు.