ఆస్కార్ నిబంధనల్లో కీలక మార్పులు
ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైంది ఆస్కార్ అవార్డు. 99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2027, మార్చి 14న జరగనుంది. అయితే, ఆస్కార్ అవార్డుల 99వ ఎడిషన్ కోసం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏఎంపీఏఎస్) కొత్త మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను వెలువరిం చింది. ఈ కొత్త నిబంధనలు చలనచిత్ర రంగంలో మారుతున్న సాంకేతికత, ముఖ్యంగా ఏఐ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
ఇప్పటివరకు ఒక నటుడు ఒకే కేటగిరీలో ఒక సినిమాకే నామినేట్ అయ్యే అవకాశం ఉండగా, ఇకపై ఎక్కువ విభిన్న పాత్రలతో ఒకే విభాగంలో నామినేషన్లు పొందే వీలు కల్పించారు. ఈ ప్రదర్శనలు రచయితలు రాసినదై ఉండాలని, నటుల ముందస్తు అనుమతితో కూడిన ‘హ్యూమన్ పెర్ఫార్మెన్స్’ అర్హత పొందుతుందని స్పష్టం చేసింది. ఏఐ -జనరేటెడ్ నటనకు, కథలకు ఈ తాజా నిర్ణయంతో చెక్ పడినట్టయ్యింది.
అవార్డుపై దర్శకుల పేరు..
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో అకాడమీ చారిత్రాత్మక మార్పులు చేసింది. గతంలో ఒక దేశం నుంచి ఒక సినిమానే అధికారికంగా పంపే అవకాశం ఉండేది. కానీ ఇకపై కాన్స్, వెనిస్, టొరంటో వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో అగ్ర పురస్కారాలు గెలుచుకున్న సినిమాలు, ఆయా దేశాలు అధికారికంగా నామినేట్ చేయకపోయినా నేరుగా ఆస్కార్ బరిలోకి దిగవచ్చు. అయితే, ఈ విభాగంలో అవార్డును దేశం పేరుతో కాకుండా నేరుగా దర్శకుడికే అందించాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతమైన దర్శకులకు, ఇండిపెం డెంట్ చిత్రాలకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు మెరుగుపడతాయని అకాడమీ భావిస్తోంది.
ఏఐ కథలకు నో ఎంట్రీ
సాంకేతిక, రచన విభాగాల్లో కూడా ఏఐ వినియోగంపై అకాడమీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. స్క్రీన్ప్లే విభాగానికి సంబంధించి కథ ఖచ్చితంగా ‘హ్యూమన్- ఆథర్డ్’ కావాలని నిబంధన విధించింది. ఏఐని ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి అనుమతించినప్పటికీ, సృజనాత్మకమైన ప్రధాన భాగాలు మాత్రం మనిషి మేధస్సు నుంచే రావాలని స్పష్టం చేసింది. వీటితోపాటు కాస్టింగ్ డైరెక్టర్ల గుర్తింపు, గవర్నర్స్ అవార్డుల ప్రక్రియలో మార్పులు చేయడం వంటి మార్పులు 99వ ఆస్కార్ వేడుకలో కొత్తగా చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త నిబంధనలపై సినీవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.






