ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పరిశీలన
ఓటర్లకు అవగాహన కల్పించిన యాదగిరి సునీల్ రావు
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్ లో బూత్ లెవల్ అధికారులతో కలిసి ఇంటింటికీ జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఫారాల పట్ల, మరియు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగే విధానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.
ఓటర్లందరూ ఈ విషయాలను గమనించి అధికారులకు సహకరించాలని కోరారు. అధికారులు ఇంటింటికీ వచ్చి అందించే పంపిణీ ఫారాలను ఓటర్లు స్వీకరించాలి.బూత్ లెవల్ అధికారులు ఇచ్చిన ఫారాలను వివరాలతో సరిగ్గా నింపి, తిరిగి ఆ అధికారులకే సమర్పించాలి. ఫారాలను తిరిగి ఇచ్చేటప్పుడు ఓటర్లు తప్పనిసరిగా తమ కొత్త ఫోటోను జత చేసి ఇవ్వాలి.
ఈ విధంగా ఫారాలు నింపి కొత్త ఫోటోను జత చేయడం ద్వారా, ఓటర్లందరి తాజా ఫోటోలతో కూడిన సమగ్రమైన, మెరుగైన ఓటరు జాబితా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటింటికీ వస్తున్న బూత్ లెవల్ అధికారులకు ఓటర్లందరూ తమ వంతు సహకారం అందించి, ఈ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని యాదగిరి సునీల్ రావు తెలిపారు.






