10వ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల: పదో తరగతి వార్షిక పరీక్షలను విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Collector Rizwanbasha Shaik) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థులు ఇన్విజిలేటర్లు, ఇతర ఎవరూ కూడా పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్స్ తీసుకురాకుండా కట్టుదిట్టంగా తనిఖీలు చేయాలన్నారు. వేసవి కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ఫ్యాన్లు వెలుతురు ఉండేలా చూడాలని, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారిని విజయలక్ష్మి, జిల్లా పరీక్షల సమన్వయకర్త శ్రీనివాసులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




