29 May, 2026 | 10:33 PM

పూడికతీతతో భూగర్భ జలాల్లో వృద్ధి

29-05-2026 11:54 AM

బిజినేపల్లి: గ్రామాల్లోని చెరువుల నుండి పూడిక తీయడం ద్వారా చుట్టూ పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టాలు పెరగడంతో పాటు సాగునీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కానుగల కుంట చెరువులో ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ గ్రామీణ నీటి వనరుల పరిరక్షణలో ఉపాధి హామీ పనులు కీలకమని, రైతులకు ఉపయోగపడేలా చెరువుల్లో పూడిక తీత పనులు పూర్తి చేయాలని, గ్రామీణాభివృద్ధి వ్యవసాయాభివృద్ధికి ఉపాధి హామీ పనులు కీలకమన్నారు.

ఉపాధి హామీ పథకం పనులను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  పనుల్లో పాల్గొంటున్న కూలీల సంఖ్య, రోజువారీ పనితీరు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు పూడిక తొలగింపు పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఎంపిడిఓ కథలప్ప, ఇతర అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.