ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభం, రహదారులకు శంకుస్థాపన
చర్లలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన
చర్ల,(విజయక్రాంతి): మారుమూల గిరిజన మండలమైన చర్లకు అభివృద్ధి ఫలాలు అందించే దిశగా భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు గ్రామస్తుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా తొలుత చర్ల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ఫెర్టిలైజర్ షాప్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
రైతులకు సకాలంలో, సరైన ధరకు ఎరువులు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం లింగాపురం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాకర్ల సుందరయ్య దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. దేవరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడెం, గోగుబాక, రాళ్లగూడెం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామీణ రహదారుల అభివృద్ధితోనే మారుమూల ప్రాంతాలు ప్రధాన స్రవంతిలోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.






