సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు
కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్
జవహర్ నగర్,(విజయక్రాంతి): సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదని, కబ్జాదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్ హెచ్చరించారు. జవహర్నగర్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన కట్టడాలను కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేశ్ ఆదేశాల మేరకు గిర్దావర్ సత్యనారాయణ సమక్షంలో శుక్రవారం ప్రగతినగర్, బీజేఆర్నగర్, కార్మికనగర్లోని నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను గుర్తించి ఇప్పటికే కంచెలు ఏర్పాటు చేశామన్నారు. నూతన నిర్మాణాలు ఎలాంటి చేయవద్దని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






