పాత కక్షలతో ఇంటికి నిప్పు
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కంబాలపల్లి గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఓ ఇంటికి నిప్పంటించిన ఘటనలో సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. గ్రామానికి చెందిన రామకృష్ణకు, అదే గ్రామానికి చెందిన రాజుకు ఇటీవల జరిగిన బోనాల పండుగ సందర్భంగా వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పాత కక్షలను మనసులో పెట్టుకున్న రాజు అర్ధరాత్రి సమయంలో తన ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు బాధితుడు రామకృష్ణ ఆరోపించాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనంతో పాటు కలప, విలువైన సామాగ్రి దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






