గద్వాలలో సరిత తిరుపతయ్యకు అపూర్వ స్వాగతం
నడిగడ్డలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ
గద్వాల టౌన్ మే 18: తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గం గద్వాలకు విచ్చేసిన సరిత తిరుపతయ్యకు సోమవారం నడిగడ్డ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభమైన భారీ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సరిత తిరుపతయ్య మాట్లాడుతూ ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా నాపై ప్రేమాభిమానంతో తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు.
తనకు ఈ కీలక బాధ్యత అప్పగించడంలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,ఎంపీ మల్లు రవి,కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,భట్టి విక్రమార్క,వాకిటి శ్రీహరి తదితర నాయకత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలబడేందుకే తనకు ఈ పదవి దక్కిందని ఆమె పేర్కొన్నారు. గద్వాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






