20-02-2026 12:00:00 AM
మణికొండ, ఫిబ్రవరి 19 (విజయక్రాతి) : నగరంలో దారుణం వెలుగుచూసింది. స్నేహం పేరుతో వల వేసి, కత్తితో బెదిరించి, బలవంతంగా మద్యం తాగించి 16 ఏళ్ల బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు నర్సింగి పోలీసులు వెల్లడించారు. పుప్పాలగూడకు చెంది న 16 ఏళ్ల బాలిక ఫిబ్రవరి 16న ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో బాధితురాలి తల్లి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి 18న చెంగిచెర్లలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బాలికను గుర్తించి రక్షించారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఫిబ్రవరి 7న చార్మినార్ ప్రాంతానికి షాపింగ్కు వెళ్లిన బాలికకు తలాబ్కట్టకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు.
ఈ క్రమంలో 16న ఇంట్లో చెప్పకుండా మదీనా ప్రాంతానికి వెళ్లిన బాలిక ఆ బాలుడితో కలిసి చార్మినార్ పరిసరాల్లో తిరిగి రాత్రి సమయంలో ఆ బాలుడు తన స్నేహితులైన ఇమ్రాన్, మరో మైనర్ను అక్కడికి పిలిపించాడు. ముగ్గురూ కలిసి బాలికను ఆటోలో చెంగిచెర్లకు తీసుకెళ్లారు. అక్కడ కత్తితో బెదిరించి, బలవంతంగా మద్యం తాగించి శారీరకంగా, లైంగికంగా దాడికి పాల్పడ్డారు.
ఈ దారుణానికి సంబంధించి నర్సింగి పోలీసులు ప్రధాన నిందితుడు ఇమ్రాన్, బాలికను ట్రాప్ చేసి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, పట్టుబడ్డ ప్రధాన నిందితుడు ఇమ్రాన్ పక్కా నేరస్థుడని పోలీసులు గుర్తించారు. దొంగతనం, దాడులు తదితర 8 కేసులు అతడిపై ఇప్పటికే ఉన్నాయని, రైన్బజార్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై సస్పెక్ట్ షీట్ కూడా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.