ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలి: ఎన్ఎస్ యుఐ
మఠంపల్లి జులై 08(విజయక్రాంతి): మండల పరిధిలోని పెదవీడు గ్రామంలో ఉన్న విద్వాన్ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి స్టడీ కండక్ట్,ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే ఈ వసూళ్లను నిలిపివేయాలని ఎన్ఎస్యఐ మఠంపల్లి మండల అధ్యక్షుడు చిలక లోకేష్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో)కు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం - 2009 ప్రకారం విద్యార్థులకు స్టడీ కండక్ట్,టీసీ జారీ పూర్తిగా ఉచితంగా చేయాల్సి ఉండగా కానీ విద్వాన్ పాఠశాలలో మాత్రం టీసీ ఇవ్వాలంటే రూ.1500 రూపాయలు వరకు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.అదే విధంగా అక్రమంగా పాఠ్య పుస్తకాలు ఇతర విద్య సామగ్రి స్కూల్ లోనే విక్రయాలు జరుపుతు,అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.టీసీ పేరుతో ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని,అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఈ విద్యాసంస్థపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎంఈవోను కోరారు.






