రోడ్డుపై ప్రస్తారోకో నిర్వహించిన రైతులు
రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట మండలం కోమటిపల్లి ఐకెపి కేంద్రం వద్ద రైతుల ఆవేదన రోడ్డెక్కింది. వడ్లు కొనుగోలు చేయకపోవడంతో పాటు రాత్రిపూట ధాన్యం దొంగతనాలు జరుగుతున్నాయంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. కోటిపల్లి ఐకెపి సెంటర్కు వడ్లు తీసుకొచ్చిన రైతులు రోజులుగా కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
సెంటర్ వద్ద కాపలా సిబ్బంది లేకపోవడంతో రాత్రిపూట వడ్ల కుప్పల నుంచి ధాన్యం దొంగతనం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లంచం ఇస్తేనే వడ్లు నింపుతున్నారని, లేకపోతే రోజుల తరబడి తిప్పలు పెడుతున్నారని రైతులు మండిపడ్డారు. సమస్య పరిష్కారం కోరుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు రైతులతో చర్చించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.






