ఘనంగా డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
- రైతు పండుగగా నిర్వహణ
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్
గంభీరావుపేట,(విజయక్రాంతి): గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్ నేతృత్వంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం టపాకాయలు పేల్చి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
తదనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, ఈ కార్యక్రమాన్ని రైతు పండుగగా నిర్వహించారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా రైతులు అభినందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్ మాట్లాడుతూ, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు సంక్షేమానికి, పేద ప్రజల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో నిలిచివున్నాయని తెలిపారు.
అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా, సాగునీటి సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






