1 July, 2026 | 2:22 AM

కొత్తూరు చెరువుల్లో కలుషిత నీరు

01-07-2026 01:37 AM

అధికారులకు మత్స్యకారుల ఫిర్యాదు

షాద్ నగర్, జూన్ 30 (విజయక్రాంతి):కొత్తూరులోని చెరువుల్లోకి పరిశ్రమల కలుషిత నీరు చేరడంతో భారీగా చేపలు చనిపోయి, మత్స్యకార రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విషయమై కొత్తూరు ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మత్స్యకారులు ఎంఆర్‌ఓ, ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే చెరువుల నీటి నాణ్యతను పరిశీలించి, భవిష్యత్తులో కాలుష్యం చేరకుండా నిరోధక చర్యలు చేపట్టాలని కోరారు. చెరువు పరిధిని అధికారికంగా డీమార్కేషన్ చేసి సరిహద్దులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘం అధ్యక్షుడు మాసూల అంజయ్య, ఉపాధ్యక్షుడు ఇప్పల్ల రమేష్, కార్యదర్శి ఇప్పల్ల గిరి, ముదిరాజ్ సంఘం నాయకులు మాసూల రామకృష్ణ, వీరమోని శివకుమార్, ఇప్పల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.