ఒక్క టీకాతో పశువుల్లో గురక వ్యాదికి సంపూర్ణ చెక్
అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి.పెంటయ్య
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలో తొలకరి వర్షాలకు పశువులకు సోకే గురక అంటువ్యాధుల నివారణకు టీకాలను అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... తొలకరిలో కురిసే వర్షాలకు అప్పుడే మొలిచిన గడ్డి పిలకలను చూడగానే వేసవి అంతా మండుటెండల్లో పచ్చి పశుగ్రాసం కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్న పశువులు ఆబగా తినడానికి ప్రయత్నిస్తాయని అలా తినే క్రమములో గడ్డి మొలకలతోపాటు మట్టి రేణువులలో ఉన్న బాక్టీరియా కూడా గడ్డిద్వారా కడుపులోకి వెళ్లి అతి ప్రమాదకరమైన గురక వ్యాధిని కలిగిస్తుందని అన్నారు.
వ్యాధి సోకిన పశువు, అధిక జ్వరం, పొట్ట ఉబ్బి, మేత మేయక, గొంతు దగ్గర కండరాలు వాపు వచ్చి శ్వాస ఆడక గురకగా మారి సకాలంలో వైద్యం అందకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. ఈ గురక వ్యాధి బలంగా ఆరోగ్యంగా ఉన్న గేదెలు, తెల్ల పశువులు, గొర్రెలు మేకల్లో సోకే అవకాశం ఉంది. చికిత్స కన్నా నివారణే మేలన్న నానుడిననుసరించి పశుపోషకుల ఇంటివద్దకు వచ్చి నిర్వహిస్తున్న గురకరోగ నివారణ టీకా కార్యక్రమాన్ని వినియోగించుకుని తమ పశువుల ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమములో వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ డా సిరిపురం సురేంద్ర, సిబ్బంది సాయికృష్ణ, చంద్రకళ, సాగర్ పాల్గొన్నారు.






