4 April, 2026 | 5:12 PM

రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష

04-04-2026 03:30 PM

హైదరాబాద్: పవిత్ర జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రం బాసర(Basara Temple) అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddyసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాస్టర్ ప్లాన్ ను సీఎంకు వివరించారు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భవిష్యత్ అవసరాలు, రద్దీ దృష్ట్యా విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను(EV vehicles) మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పవిత్రకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలన్నారు. ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రూ. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.