జూబ్లీ హిల్స్ ఉపఎన్నికపై సీఎం ఫోకస్
హైదరాబాద్: నగరంలోని జూబ్లిహిల్స్(Jubilee Hills by-election) నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో స్థానిక నాయకత్వం, ఇన్ ఛార్జ్ లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ అభివృద్ది, ప్రజలకు ప్రజా ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ కార్యక్రమాల పై ప్రచార ప్రణాళికలు రూపొందించుకోవాలని, గెలుపే లక్ష్యంగా గల్లీ కార్యకర్త నుండి రాష్ట్ర నాయకత్వం వరకు పూర్తి సమన్వయంతో పని చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. పోలింగ్ బూత్ ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు.
నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలని వెల్లడించారు. కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందన్నారు. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటానన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






