కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం(Central Government) రాష్ట్రాలకు కేటాయించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల వాటాను 50 శాతం నుండి 70 శాతానికి పెంచింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం దృష్ట్యా, ఉక్కు, ఆటోమొబైల్ అధిక శ్రామిక శక్తి అవసరమయ్యే పరిశ్రమల అవసరాలను తీర్చడానికి ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చమురు కార్యదర్శి నీరజ్ మిట్టల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో, అదనపు సరఫరాను శ్రమ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
ఈ పరిశ్రమలలో ఉక్కు, ఆటోమొబైల్స్, వస్త్రాలు, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్లు ఉన్నాయి. ఇవి ఇతర కీలక రంగాలకు మద్దతిస్తాయి. ఆ లేఖ ప్రకారం, చమురు శాఖ కార్యదర్శి ఇప్పటికే ఉన్న 50 శాతం కోటాకు అదనంగా మరో 20 శాతాన్ని కేటాయించారు. దీనితో ప్యాక్ చేసిన గృహేతర ఎల్పీజీకి(Commercial Gas Supply) సంబంధించి సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలోని 70 శాతానికి మొత్తం వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు చేరుకుంటుందని తెలిపారు.
చమురు రవాణాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో(Strait of Hormuz) నెలకొన్న అవాంతరాల మధ్య, పశ్చిమ ఆసియా/మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలిగిస్తూనే ఉన్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్(Hardeep Singh Puri) పూరి కూడా కేటాయింపుల పెంపును ప్రకటిస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు. అనేక దేశాలు కఠినమైన ఇంధన పొదుపు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన భద్రత, లభ్యత, అందుబాటు ధరలకు ఒక ఒయాసిస్గా నిలుస్తూనే ఉన్నారని పూరి పేర్కొన్నారు.




