20 August, 2026 | 6:40 PM

ప్రజల ఆస్తుల రక్షణే లక్ష్యం – సీపీ సుమతి

20-08-2026 05:53 PM

సీఈఐఆర్‌ సాయంతో ఏడు నెలల్లో 1,834 సెల్‌ఫోన్ల రికవరీ

ఉప్పల్, ఆగస్టు 20విజయక్రాంతి: ప్రజల ఆస్తుల రక్షణకు మల్కాజిగిరి పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన సెల్‌ఫోన్లను యజమానులకు అందించేందుకు ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి బాదుగుల తెలిపారు. ఉప్పల్‌లోని డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ సుమతి మాట్లాడుతూ, సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్‌) పోర్టల్‌ సాయంతో 2026 ఫిబ్రవరి 11 నుంచి ఇప్పటివరకు కమిషనరేట్‌ పరిధిలోని 29 పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన ఫోన్ మిస్సింగ్‌, చోరీ కేసులకు సంబంధించి మొత్తం 1,834 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. జోన్‌ల వారీగా ఎల్‌బీనగర్‌ జోన్‌లో 753, ఉప్పల్‌ జోన్‌లో 594, మల్కాజిగిరి జోన్‌లో 243, కంటోన్మెంట్‌ జోన్‌లో 244 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌ల వారీగా ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా 256 ఫోన్లు రికవరీ అయ్యాయని పేర్కొన్నారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లను సంబంధిత యజమానులకు అప్పగిస్తున్నామని, ఇంకా గుర్తించాల్సిన ఫోన్ల కోసం అన్వేషణ కొనసాగుతోందని సీపీ తెలిపారు. ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఫోన్‌ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఐఎంఈఐ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ వంటి వివరాలు అందుబాటులో ఉంటే ఫోన్‌ను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్కే సురేష్ కుమార్ ఉప్పల్ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ వెంకట్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.