మండేపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహణ
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) కార్యక్రమంలో భాగంగా అయి–సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కార్యక్రమ కోఆర్డినేటర్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు గారంపల్లి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, వివిధ రకాల కాషాయాల తయారీ విధానం, వాటి ద్వారా పంటల సంరక్షణ, నేల ఉర్వరత పెంపు, ఖర్చు తగ్గింపు వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయనాల వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు.
కార్యక్రమంలో వార్డ్ సభ్యులు ప్రభుదాస్, ప్రతాపరెడ్డి, శశి, ఏఈఓ కరుణాకర్, సీఆర్పీ జమున, జ్యోతి గార్లు, రైతులు దుర్గారెడ్డి, శ్రీనివాస్, ఆనంద్, సీఏ శ్రీనివాస్, కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు ఆసక్తిగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.




