జనగణన 2027పై అవగాహన కార్యక్రమం
అవగాహన కల్పించిన బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో, జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ నమోదు (Self Enumeration)పై అవగాహన కార్యక్రమం డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 264 కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, డిజిటిల్ పద్దతిలో నిర్వహించే జనగణన–2027లో స్వీయ నమోదు విధానం చాలా కీలకమని, ప్రతి కుటుంబం సరైన వివరాలను స్వయంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తమ తమ కాలనీలలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. స్వీయ నమోదు ప్రక్రియలో ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో జనగణనపై అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.






