ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి: జిల్లా జడ్జి శ్రీనివాసరావు
సత్తుపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని 6వ అదనపు జిల్లా జడ్జి మారగాని శ్రీనివాసరావు అన్నారు. శనివారం హెటిరో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా సూటికల్స్ సైన్సెస్ నందు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలు విద్యార్థులకు తెలియజేయడం వలన, ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకుంటారని, ప్రతి ఒక్కరు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, క్రిమినల్ కేసులు సివిల్ కేసులు ఫోక్స్, బిఎన్ఎస్, ఎన్డిపిఎస్ చట్టాలపై క్షుణ్ణంగా వివరించారు.
ఏ పని చేయాలన్నా ఆవేశంతో కాకుండా,ఆలోచనతో చేయాలని, దీని ద్వారా మంచి చెడు తెలుస్తుందని, నేరాలు కంట్రోల్ అవుతాయని తెలిపారు. సమాజంలో మంచిని గ్రహించి చెడును వదిలివేసి, ఒక గోల్ పెట్టుకొని భవిష్యత్తులో స్థిరపడేందుకు చదవాలని వివరించారు. మోటార్ వాహన చట్టం పై అవగాహన,డ్రగ్స్ వంటి జోలికి వెళ్ళవద్దని,తల్లిదండ్రులు మాట,అధ్యాపకులు మాట వినాలని తద్వారా సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని ప్రతి ఒక్కరు సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.






